టీడీపీ చారిత్రక తప్పిదంతో పోలవరం నిర్మాణంలో ఇబ్బందులు: ఏపీ మంత్రి అంబటి రాంబాబు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకుంటున్న జాప్యంపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటీవల కురిసిన వర్షాలు, విడతలవారీగా పోటెత్తిన వరదల కారణంగా పోలవరం నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. వరద తగ్గుముఖం పట్టిన వెంటనే పనులను పున:ప్రారంభించే విషయంపై ఆలోచన చేస్తామన్నారు. అనివార్య కారణాల వల్ల ప్రాజెక్టు పనుల్లో జాప్యం చోటుచేసుకుంటూ ఉండటం బాధేస్తోందన్నారు.

పోలవరం నిర్మాణంలో గత టీడీపీ ప్రభుత్వం ఓ చారిత్రక తప్పిదం చేసిందని రాంబాబు అన్నారు. టీడీపీ చేసిన ఈ చారిత్రక తప్పిదం కారణంగా పోలవరం నిర్మాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన చెప్పారు. కాఫర్ డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ ను నిర్మించడం చారిత్రక తప్పిదమేనని ఆయన అన్నారు. ఈ ఒక్క తప్పిదం వల్ల రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరం నిర్మాణం విషయంలో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడిపోయిందన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసేది మాత్రం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని అంబటి చెప్పారు.

Polavaram Project
Andhra Pradesh
YSRCP
Ambati Rambabu
YS Jagan
TDP

More Telugu News